హైదరాబాద్ నుంచి శంషాబాద్ రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికుల ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు హెచ్ఎండీఏ మరో భారీ ఫ్లైఓవర్కు ప్రణాళిక సిద్ధం చేసింది. బంజారాహిల్స్ రోడ్డు నంబరు 1 జీవీకే వన్ మాల్ నుంచి మాసబ్ట్యాంక్ మీదుగా పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్వేకు అనుసంధానిస్తూ సుమారు 4 కిలోమీటర్ల మేర ఈ పైవంతెన నిర్మించనున్నారు. ఇందుకోసం క్షేత్రస్థాయి సర్వే ప్రారంభం కాగా.. రానున్న రెండేళ్లలో దీనిని అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా బంజారాహిల్స్, మాసబ్ట్యాంక్, కేర్ ఆసుపత్రి జంక్షన్లలో రద్దీ వేళల్లో ఎదురయ్యే ట్రాఫిక్ ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం లభించనుంది.