తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో జూన్ 3 వరకు తీవ్రమైన ఎండలు, వడగాల్పులు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీల వరకు, కొన్నిచోట్ల 45 డిగ్రీలు దాటే అవకాశం ఉందని తెలుపుతూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. శనివారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో అత్యధికంగా 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా వడదెబ్బకు గురై 13 మంది మరణించారు. మరోవైపు అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయని.. జూన్ 10 తర్వాతే రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.