హైదరాబాద్ నగరం నుంచి ఉత్తర తెలంగాణ జిల్లాలకు వెళ్లే ప్రయాణికుల ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు ప్రభుత్వం రూ. 5,750 కోట్లతో చేపట్టిన రెండు భారీ ఎలివేటెడ్ కారిడార్ల పనులు శరవేగంగా ప్రారంభమయ్యాయి. ప్యారడైజ్ నుంచి డెయిరీఫాం వరకు ఒక కారిడార్, ప్యారడైజ్ నుంచి శామీర్పేట ఔటర్ రింగ్ రోడ్డు వరకు రెండో కారిడార్ను నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టుల వల్ల గంటల కొద్దీ పట్టే ప్రయాణ సమయం కేవలం 10 నుంచి 15 నిమిషాలకు తగ్గనుంది. హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ ఆదేశాలతో అధికారులు శనివారం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, రెండేళ్లలో పూర్తి చేయాలని స్పష్టం చేశారు.