AP Kumki Elephants: పలమనేరుకు చేరుకున్న కుంకీ ఏనుగులు

1 year ago 25
కర్ణాటక-ఆంధ్రప్రదేశ్‌ మధ్య గత ఆగస్టులో కుదిరిన ఒప్పందం ప్రకారం కన్నడనాడు నుంచి కుంకీ ఏనుగులు చిత్తూరు జిల్లా పలమనేరుకు చేరుకున్నాయి. బుధవారం రాత్రి పలమనేరు చేరుకున్న నాలుగు కుంకీ ఏనుగులకు డీఎఫ్ఓ భరణి స్వాగతం పలికారు. ఏనుగులను ట్రక్కుల నుంచి దించిన తర్వాత వాటికి గుమ్మడికాయలు, కర్పూరంతో దిష్టి తీశారు. బెంగళూరులోని విధానసౌధ ముంగిట బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, అటవీశాఖ మంత్రి ఈశ్వర ఖండ్రే.. కుంకీ ఏనుగుల బదిలీ ఆదేశ పత్రాలను ఆంధ్రప్రదేశ్‌ అటవీ, పర్యావరణ శాఖ మంత్రి, ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌కు అందించిన విషయం తెలిసిందే. ఒప్పందం ప్రకారం ఆరు కుంకీ ఏనుగులను ఆంధ్రప్రదేశ్‌కు అప్పగించాల్సి ఉన్నా శిక్షణ, ఆరోగ్య ప్రమాణాల దృష్ట్యా బుధవారం నాలుగింటినే తరలించారు. మరో విడతలో మిగిలిన రెండూ వస్తాయి.తొలి విడతలో వచ్చిన నాలుగు కుంకీల్లో చిక్కమగళూరు నుంచి 15 ఏళ్ల కృష్ణ, శివమొగ్గ నుంచి 14 ఏళ్ల అభిమన్యు, కుశాల్ నగర్ నుంచి 39 ఏళ్ల దేవ, దుబారె నుంచి 26 ఏళ్ల రంజన్‌ ఉన్నాయి. వీటిని సాగనంపేందుకు మైసూరుకు చెందిన మహేంద్ర అనే 28 ఏళ్ల ఏనుగు కూడా వచ్చింది. దీన్ని మళ్లీ వెనక్కి తీసుకెళ్తారు.
Read Entire Article